న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13 : ప్రజాప్రతినిధుల పై క్రిమినల్ కేసులు ఏళ్ల తరబడి పెండింగ్ ఉండకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు కొత్త ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు చట్టం చేసే ప్రతిపాదనను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని సుప్రీం స్పష్టం చేసింది. ఇందుకు అవసరమైన చట్టం చేయాల్సింది పార్లమెంటేనని, ప్రజాప్రతినిధుల ఆస్తులు అమాంతం పెరగడం పై లోక్ ప్రహరి అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు తెలిపింది. చట్ట సభల్లో కొత్త చట్టాలు చేసినప్పుడల్లా కొత్త హక్కులు, బాధ్యతలు ఏర్పడుతున్నాయని ధర్మాసనం అభిప్రాయపడింది. తద్వారా కేసులు ఎక్కువ వస్తున్నాయని అందుకనుగుణంగా న్యాయ స్థానాల సంఖ్య పెరగడం లేదని ఆక్షేపించింది.