హైదరాబాద్, సెప్టెంబర్ 13 : హైదరాబాద్ మహా నగరంలో సంచలనం సృష్టించిన ఇంటర్ విద్యార్థిని చాందిని హత్య కేసు మిస్టరీని ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. చాందినిని పెళ్లి చేసుకొమ్మని ఆమె స్నేహితుడు సాయికిరణ్ బాగా ఒత్తిడి చేయడంతో ఆమె ఒప్పుకోలేదు. దీంతో పథకం ప్రకారం ఆమెను అమీన్పూర్ గుట్టలోకి తీసుకెళ్లి హత్య చేసినట్లు సైబరాబాద్ పోలీసులు తేల్చారు. పోలీసుల కథనం ప్రకారం.. మియాపూర్ మదీనాగూడకు చెందిన హోల్సేల్ వస్త్ర వ్యాపారి కిషోర్జైన్ కుమార్తె చాందిని జైన్(17) ఈ నెల 9 వ తేదీన తన స్నేహితులను కలిసేందుకు వెళ్తున్నానని చెప్పి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు అదే రోజు మియాపూర్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు మూడు రోజుల తర్వాత అమీన్పూర్ గుట్టల్లో శవాన్ని గుర్తించారు. ఆ ప్రదేశంలో లభించిన బాలిక సెల్ ఫోన్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు అనుమానం ఉన్న వ్యక్తుల్ని విచారించారు. అదృశ్యమైన రోజు చాందిని ఓ యువకుడితో కలిసి ఆటోలో వెళ్ళినట్లు గుర్తించిన పోలీసులు అతను చాందిని ప్రియుడు సాయికిరణ్ గా గుర్తించి అతనే చా౦దినిని తీసుకెళ్ళి హత్య చేసి అక్కడి గుట్టల్లో పడేసినట్లు నిర్ధారించారు.