అహ్మదాబాద్ సెప్టెంబర్ 13: ఇండో-జపాన్ 12వ వార్షిక సదస్సులో భాగంగా జపాన్ ప్రధాని షింజో అబే బుధవారం నుంచి రెండు రోజుల పాటు భారత దేశంలో పర్యటించనున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని షింజో అబేతో కలసి ఇండో-జపాన్ వార్షిక సదస్సుతో పాటు పలు కార్యక్రమాలలో వారు పాల్గొంటారని అనంతరం మోదీ, షింజే ఇరువురు సబర్మతి ఆశ్రమాన్ని సందర్శిస్తారని అధికారులు తెలిపారు. గుజరాత్లోని అహ్మదాబాద్ నగరం లో మొత్తం 9000 మందికి పైగా పోలీస్ సిబ్బందితో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రతా ఏర్పాట్ల కోసం నగరంలోని పోలీస్ సిబ్బందితో పాటు ఇతర ప్రాంతాల నుంచీ పోలీసులను రప్పించినట్టు డీసీపీ బలరామ్ మీనా చెప్పారు. రాష్ట్ర రిజర్వ్ పోలీస్కు చెందిన 12 కంపెనీల బలగాలతో పాటు బాంబ్ స్క్వాడ్, క్విక్ రెస్పాన్స్ టీమ్లను రప్పించామని, ఎన్ఎస్జీ కమాండోల బృందాన్ని పంపాలని కూడా కేంద్ర హోంశాఖను కోరామని తెలిపారు.