హైదరాబాద్, జూన్ 5 : జంటనగరాల్లో మళ్ళీ పండుగ వాతావరణం రాబోతుంది. సంప్రాదాయబద్ధంగా జరుపుకొనే బోనాల జాతర ఈ నెల 25న మొదలుకానుంది. ఆషాడ మాసం మొదటి ఆదివారం లేదా మొదటి గురువారం బోనాల జాతర మొదలవడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది ఆషాడ మాసం తొలి ఆదివారం (జూన్ 25) గోల్కొండ బోనాల జాతర ప్రారంభమవుతుందని గోల్కొండ ఎల్లమ్మ (మహంకాళి) ఆలయ కార్యనిర్వాహనాధికారి తెలిపారు. జూలై 23న తొమ్మిదో బోనంతో జాతర ముగుస్తుందని వెల్లడించారు. సికింద్రాబాద్ లోని జనరల్ బజార్ లో కొలువుదీరిన శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాలు జూలై 9, 10వ తేదీల్లో జారుగనునున్నాయి. గోల్కొండ బోనాలు, లష్కర్ బోనాలతో పాటు పాతబస్తీ బోనాల నిర్వహణ కోసం దేవాదాయ శాఖ అధికారులు ఆలయ కమిటీలు ఏర్పాటు చేస్తున్నాయి.