తమిళనాడు సెప్టెంబర్ 12: తమిళనాట తిరుగులేని నాయకురాలిగా పేరు గాంచిన జయలలిత అనారోగ్య కారణంతో మృతి చెందడంతో ఆమె స్థానంలో ఆమె సన్నిహితురాలు శశికళ పార్టీ పగ్గాలను చేత పట్టిన విషయం తెలిసిందే. పార్టీ పగ్గాలు ఆమె చేతిలో ఉన్నా, పదవి మాత్రం పన్నీర్ సెల్వం అధిరోహించడంతో ఎలాగైనా పన్నీర్ ను గద్దె దించాలనే లక్ష్యంతో పార్టీలో ముసలం పుట్టించింది శశికళ. అయితే ఆ సమయంలోనే సుప్రీం కోర్టు తీర్పు వెలువడడం శశికళ జైలుకు వెళ్లడం, శశికళ నమ్మిన బంటు పళని స్వామి పన్నీర్ ను గద్దె దించి సీఎం సీటు దక్కించుకోవడం, అప్పుడు పన్నీర్ మోడిని సంప్రదించడం, మోడీ తన రాజకీయ చతురతతో పళని, పన్నీర్ వర్గాలను ఒక్కటి చేయడం, చివరికి చిన్నమ్మను ఒంటరిని చేసి పార్టీ నుండి బహిష్కరించడం జరిగాయి. అయితే ఈ విషయాలను గమనించినట్లయితే చిన్నమ్మ తాను తీసిన గోతిలో తానే పడినట్లు స్పష్టంగా అర్థం అవుతుంది. జయలలిత మరణం వెంటనే ఎలాగైనా సీఎం స్థానాన్ని కైవసం చేసుకోవాలనే కుతూహలమే ఆమెను ఈ స్థాయికి దిగజార్చిందని విశ్లేషకుల అభిప్రాయం. ఈ రాజకీయ కుట్రలతో శశికళ ఏం సాధించింది..? అని ప్రశ్నించుకుంటే ఏం లేదనే సమాధానమే విస్పష్టం. సీఎం పదవి అనేది కోరుకుంటే రాదని, అది ప్రజల మనోభీష్టం మేరకే సిద్ధిస్తుందని గ్రహించని చిన్నమ్మ చివరకు కటకటాలపాలయ్యారు. రాజకీయాల్లో స్వార్థం అవసరమే, కానీ అది హద్దు మీరితే రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారుతుందని చిన్నమ్మ జీవితం ఆధారంగా తెలుస్తుంది..!