పాకిస్థాన్, సెప్టెంబర్ 12: పాకిస్థాన్లోని కరాచీలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.... జిర్గా కులానికి చెందిన ఓ అమ్మాయి (15), ఓ అబ్బాయి (17) ప్రేమాయణం కొనసాగించారు. అయితే, పెద్దలు తమ ప్రేమను అంగీకరించరని తెలుసుకుని గత నెల ఇంటి నుంచి పారిపోయారు. వారి గురించి గాలించి ఎట్టకేలకు వారి ఆచూకీ తెలుసుకుని, వారి కుటుంబ సభ్యులు ఆ జంటను ఇంటికి తీసుకువచ్చారు. అయితే ఆ గ్రామానికి చెందిన జిర్గా మత పెద్దలు ఆ ప్రేమ జంటపై క్రురంగా ప్రవర్తించారు. వెంటనే ఆ ప్రేమ జంటను చంపేయాలని ఆదేశించారు. ఈ తీర్పుకు ఎవరూ అడ్డు చెప్పకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు చూస్తుండగానే ఆ అమ్మాయిని, అబ్బాయిని మంచానికి కట్టేశారు. అనంతరం వారికి కరెంట్ షాక్ ఇచ్చి, మొదటి రోజు అమ్మాయిని చంపేయగా, మరుసటి రోజు అబ్బాయిని చంపేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.