హైదరాబాద్, సెప్టెంబర్ 11 : అనిశా వలలో మరో చేప చిక్కింది. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆధారాలు లభించడంతో కర్నూలు తూనికలు, కొలతల శాఖ ఇన్స్పెక్టర్ నాగోతు స్వామిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ ఎర్రగడ్డలోని తన నివాసంలో, అతని బావమరిది ఇంట్లో అనిశా అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టగా రూ.పదికోట్ల విలువైన అక్రమాస్తులను గుర్తించారు. అంతేకాకుండా హైదరాబాద్ నగరంలో మూడు అంతస్తుల భవనం, విజయవాడలో ఒక భవనంతో పాటు మరికొన్ని చోట్ల స్థలాలు ఉన్నట్లు విచారణలో గుర్తించారు. గతంలోనూ స్వామి పలుసార్లు ఏసీబీ రైడ్ లో పట్టుబడినట్లు ఆరోపణలు ఉన్నాయి. జూలై 15 వ తేదీన రూ. ముప్పై వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడినట్లు అధికారులు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.