పనాజి, సెప్టెంబర్ 11 : భద్రతా దళాల బలోపేతం పై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఉత్తర, పశ్చిమ సరిహద్దులో భద్రతపరమైన సవాళ్లపై ఆందోళన నెలకొన్న నేపధ్యంలో రక్షణ సన్నద్ధతను అత్యున్నత స్థాయికి మెరుగు పరిచేందుకు అధిక ప్రాధ్యానమిస్తున్నట్లు చెప్పారు. రాజస్థాన్ బాడ్ మేడ్ జిల్లాలోని ఉత్తర్ లాయ్ వైమానిక స్థావరాన్ని నిర్మలా సీతారామన్ సందర్శించారు. 2001 లో అప్పటి రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెస్ కీలకమైన ఉత్తర్ లాయ్ వైమానిక స్థావరాన్ని సందర్శించగా ఇన్నేళ్ల తరువాత నిర్మల అక్కడ పర్యటించారు. ఉత్తర్ లాయ్ ఎయిర్ బెస్ ప్రాముఖ్యాన్ని, అక్కడి నుంచి సాగే కార్యకలాపాలని తెలుసుకున్నారు. సరిహద్దుల వద్ద విధులు జవాన్లను నేరుగా కలవాలన్న ప్రధాని సూచన మేరకు ఈ పర్యటన చేపట్టామని రక్షణ మంత్రి తెలిపారు.