2019 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న జగన్, బాబును ఎలాగైనా దెబ్బ తీయాలనే ఆలోచనలో ఉన్నట్లు, అందులో భాగంగానే కాంగ్రెస్ నేత చిరంజీవి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను తన పార్టీలోకి ఆహ్వానించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారా..? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. అయితే ఇటీవల కాకినాడ, నంద్యాల ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం మూటగట్టుకోవడంతో మేల్కొన్న జగన్ తన పార్టీ రాజకీయ నిపుణుడు ప్రశాంత్ కిషోర్ ను సలహా అడిగినట్లు, అందులో భాగంగానే పవన్, చిరంజీవి లను తమ పార్టీలోకి తీసుకుంటే పార్టీ గెలిచే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేయడం, తదనుగుణంగా జగన్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఇక్కడ చిరంజీవి విషయానికి వస్తే తన సొంత పార్టీనే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన చిరు ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీ తనకు మంచి పదవి కట్టబెడుతుందనే ఆశతో ఎదురుచూస్తున్న చిరు ఇప్పుడు జగన్ ఆహ్వానం మేరకు వైకాపా లో చేరితే, ఒక వేల పార్టీ ఓటమి పాలయితే అప్పుడు చిరుకు మొదటికే మోసం వస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక పవన్ విషయానికి వస్తే పవన్ ఏ పార్టీతో వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా లేనట్లు, సొంతంగా తెలుగు రాష్ట్రాల్లో బరిలోకి దిగుతున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే మరి ఇప్పుడు ఇలాంటి ఆలోచనలో ఉన్న పవన్ ను జగన్ కాంప్రమైజ్ చేయగలడా..? అన్న ప్రశ్న మదిలో మెదలక మానదు. అయితే ప్రస్తుతం పవన్ పార్టీకి రాష్ట్రంలో మంచి క్రేజ్ ఉన్న సందర్భంలో జగన్ తో పవన్ చేతులు కలిపే అవకాశాలు లేవనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు రాజకీయ వేత్తలు.