కబడ్డీలో చెలరేగిన ఘర్షణ, కాల్పుల వరకు దారి తీసింది

SMTV Desk 2017-09-11 16:54:12  Kabaddi, New delhi, Pro kabaddi, Gun Fire

ఢిల్లీ, సెప్టెంబర్ 11: సమాజం తీరు రోజురోజుకు అధః పాతాళానికి దిగజారి పోతోందనడానికి మరో నిదర్శనం కబడ్డీ ఆటలో చెలరేగిన ఘర్షణ కాల్పుల వరకు దారితీయడం. ఢిల్లీ పోలీసుల వివరాల ప్రకారం గత రాత్రి దక్షిణపురి ప్రాంతంలోని ఓ పార్కులో సి బ్లాక్‌, 20 బ్లాక్‌ జట్ల మధ్య కబడ్డీ పోటీ జరగగా, స్కోర్ విషయంలో ఇరు జట్ల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ తరుణంలో మ్యాచ్‌ చూసేందుకు వచ్చిన 20 బ్లాక్‌ జట్టుకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులు క్రీడాకారుడు అవినాశ్‌పైకి కాల్పులకు పాల్పడ్డారు. . కాల్పులకు గురైన అవినాశ్‌ను చికిత్స నిమిత్తం సమీపంలోని బాట్రా ఆస్పత్రికి తరలించారు. కాగా, భాదితుడి తలలో బుల్లెట్‌ దూసుకెళ్లడంతో పుర్రె భాగంలో చిన్నపాటి గాయమైనట్లు వైద్యులు వెల్లడించినట్లు డీసీపీ రోమిల్‌ బానియా తెలిపారు. అయితే ప్రస్తుతం ఆ యువకుడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆయన చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాల్పులకు పాల్పడిన వారికోసం గాలిస్తున్నారు.