కర్నూల్; సెప్టెంబర్-10 రాయలసీమ పారిశ్రామికంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతో ఉందని భాజపా జాతీయ మహిళా మోర్చా ఇంఛార్జి, మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. కోడుమూరులో ఆదివారం భాజపా కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె విలేకర్లతో మాట్లాడుతూ.. రాయలసీమలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తీవ్ర కరవు ఏర్పడిందని అన్నారు. రాయలసీమకు ఇప్పటి వరకు కేవలం ఒక్క పరిశ్రమ మాత్రమే వచ్చిందని, పరిశ్రమలు ఎక్కవ సంఖ్యలో రావాల్సి ఉందన్నారు. వెనుకబడిన రాయలసీమ 4 జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలోని 3 జిల్లాలు కలిపి కేంద్రప్రభుత్వం ఏడాదికి రూ.50 కోట్ల చొప్పున మూడేళ్లకు రూ. 1,050 కోట్ల నిధులు మంజూరు చేసిందని తెలిపారు. ప్రజా ప్రయోజనాల నిమిత్తం కేంద్ర ప్రభుత్వం కృషి సించాయి యోజన ఏర్పాటు చేసిందన్నారు. అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి అభివృద్ధికి సంబంధించి 8 అంశాలు రాగా.. అందులో రాయలసీమకు సంబంధించి ఒక్కటి కూడా లేదని చెప్పారు.