భువనేశ్వర్ లో ఫ్లైఓవర్ కూలి, ఒకరి మరణం

SMTV Desk 2017-09-10 15:54:05  fly over, COLLAPSE, Bhubaneswar

భువనేశ్వర్, సెప్టెంబర్ 10 : భువనేశ్వర్‌లోని నిర్మాణంలో ఉన్న ఓ ఫ్లైఓవర్‌ కూలిపోయిన ఘటనలో ఓ వ్యక్తి మరణించగా, మరో 15 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. బొమిఖల్ సమీపంలో ఈ మధ్యాహ్నం ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మృతిచెందిన వ్యక్తిని భువనేశ్వర్‌కు చెందిన వ్యాపారి సత్య పట్నాయక్ (40)గా గుర్తించారు. పట్నాయక్ కుమార్తె షీతల్ కూడా ఈ ఘటనలో తీవ్రంగా గాయపడింది. ఆమెను వెంటనే ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాద సమయంలో 20 మంది కార్మికులు ఫ్లై ఓవర్ పనుల్లో ఉన్నారు. దీంతో కొందరు వ్యక్తులు శిధిలాల కింద చిక్కుకుపోయారు. పోలీసులు, పది అగ్నిమాపక శకటాలు, సహాయక బృందాలు ఎట్టకేలకు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కటక్ నుంచి క్రేన్లు, కట్టర్లు తెప్పించారు. ఇద్దరు సీనియర్ ఇంజనీర్లు, పోలీస్ కమిషనర్ వైబీ ఖురానియా, ప్రభుత్వ అధికారులు సంఘటనా స్థలంలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు.