న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10 : హరికేన్ ఇర్మా ధాటికి ఆయా ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. అక్కడ నివసించే భారతీయుల క్షేమ సమాచారాన్ని దౌత్య అధికారులతో మాట్లాడి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పేర్కొన్నారు. కారకాస్ (వెనిజులా రాజధాని), హవానా (క్యూబా రాజధాని), జార్జ్టౌన్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో ఉన్న భారతీయులంతా ఈ ఇర్మా ధాటి నుంచి క్షేమంగా ఉన్నట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం ఫ్లోరిడాలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉండడంతో అక్కడ నివసించే భారతీయులను అట్లాంట తరలించేందుకు అన్ని సిద్ధం చేసినట్లు విదేశాంగశాఖ ప్రతినిధి రవీశ్కుమార్ ట్విటర్ ద్వారా తెలిపారు. కాగా, కరీబియన్ దీవుల్లో ఇర్మా కారణంగా దాదాపు 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు హరికేన్ ఇర్మా ప్రభావిత ప్రాంతాల్లో 24గంటలూ అందుబాటులో ఉండే హెల్ప్లైన్ను ఏర్పాటు చేశారు. సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్న వారి కోసం సింట్ మార్టెన్ నుంచి ఆహారపదార్థాలను పంపిస్తున్నారు. వాషింగ్టన్ డీసీలోని భారత దౌత్య కార్యాలయంలో హెల్ప్లైన్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది.