న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: ప్రభుత్వ పరిపాలనలో మరింత పారదర్శకతను తీసుకువచ్చేందుకు కేంద్రం ఎంచుకున్న సులువైన మార్గం ఆధార్ తో అనుసంధాన ప్రక్రియ. ఇప్పటికే బ్యాంకు ఖాతాలకు, పాన్ కార్డులకు, ప్రభుత్వ సంక్షేమ పధకాలకు ఆధార్ తో అనుసంధానం చేయడం తప్పనిసరి అని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు మొబైల్ వినియోగదారుల వంతు. మొబైల్ వినియోగదారులు అందరు తమ సిమ్ నంబరుతో ఆధార్ ను అనుసంధానం చేయకుంటే ఇక మొబైల్ సేవలు నిలిచిపోనున్నాయి తెలిపింది. అన్ని సిమ్కార్డులను ఆధార్ నంబరుతో నిజనిర్ధారణ చేసుకోవాలని, ఆధార్ నంబరుతో అనుసంధానం కాని సిమ్లను ఫిబ్రవరి 2018 తర్వాత డీయాక్టివేట్ చేయాలని సుప్రీం కోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్న విషయం తెలిసిందే. సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ లింకింగ్ ను మరింత వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఆధార్-సిమ్ అనుసంధానానికి ప్రభుత్వం వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు గడువు ఇచ్చింది. ఈ ఆధార్-సిమ్ అనుసంధానం వల్ల మోసపూరిత సమాచారం, మిస్యూజ్ను అరికట్టవచ్చని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది.