న్యూ ఢిల్లీ, సెప్టెంబర్ 09 : ఉగ్రదాడులు, రాళ్ల దాడుల వంటి ఉద్రిక్తతలు నెలకొన్న కశ్మీర్ లో పరిస్థితి చక్కదిద్దడమే లక్ష్యంగా కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ నాలుగు రోజుల పర్యటన కోసం జమ్ముకశ్మీర్ చేరుకున్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీతో భేటీ అయిన రాజ్ నాథ్ సింగ్ రాష్ట్రంలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమాలోచన జరిపినట్లు తెలుస్తుంది. 2015 లో ప్రధాని ప్రకటించిన 80 వేల కోట్ల అభివృద్ధి ప్యాకేజీ అమలుపై ఉన్నతాధికారులతో రాజ్ నాథ్ సమీక్ష నిర్వహించారు. దాడులతో కశ్మీర్ సమస్య పరిష్కారం కాదని కశ్మీరుయులను అక్కున చేర్చుకుంటేనే పరిస్థితుల మార్పు వస్తుందని, స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని స్పష్టం చేసిన నేపథ్యంలో జమ్ముకశ్మీర్ లో పర్యటిస్తున్న హోంమంత్రి కశ్మీర్ సమస్య పరిష్కరించాలన్నదే కేంద్ర అభిమాతమని, అందువల్ల విశాల దృక్పథంతో ఎవరినైనా కలిసేందుకు సిద్దమని స్పష్టం చేశారు. శ్రీనగర్, అనంత్నాగ్, జమ్మూ, రాజౌరిలలో పర్యటించనున్న హోంమంత్రి ఆ రాష్ట్రానికి చెందిన వేర్వేరు రంగాల ప్రతినిధులతో సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకోనున్నారు.