హైదరాబాద్, సెప్టెంబర్ 9: మహా నగరంలో మెట్రో రైల్ ప్రయాణం ప్రారంభం కాకముందే పెను ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒక యువతి ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళ్తే... కూకట్పల్లిలో మెట్రో స్టేషన్ వద్ద పనులు చేస్తోన్న క్రేన్ అటుగా వెళ్తున్న యువతికి బలంగా తగలడంతో తీవ్ర రక్తస్రావంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. దీంతో సంఘటనా స్థలంలో ఉన్న మెట్రో సిబ్బంది హుటాహుటిన బాధితురాలిని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే, ఆసుపత్రికి తరలించే మార్గం మధ్య లోనే ఆమె మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. నగరంలో మెట్రో పనులు ఊపందుకున్న నేపధ్యంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించడమే కాకుండా వాహనాలు వెళ్లే రూట్లను మార్చిన విషయం విదితమే. సికింద్రాబాద్ రైతి ఫైల్ బస్టాండ్ వద్ద, ఎస్సార్ నగర్ నుంచి అమీర్ పేట్ మైత్రివనం వరకు రూట్లను మార్చి పనులు కొనసాగిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లోనూ క్రేన్ల సాయంతో పనులు కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా పలు చోట్ల మెట్రో పనులు జరుగుతున్న సమాచారం తెలిసే విధంగా కూడా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.