హైదరాబాద్, సెప్టెంబర్ 9: నేడు శంషాబాద్ కేంద్రంగా జరుగుతున్న తెలంగాణ కాంగ్రెస్ నేతల శిక్షణ కార్యక్రమం అలకలకు వేదికగా మారింది. వివరాల్లోకి వెళ్తే... తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రసంగిస్తుండగా కోమటిరెడ్డి బ్రదర్స్ అనుచరులు వ్యతిరేక నినాదాలు చేశారు. అయితే ఈ సమయంలో కోమటిరెడ్డి బ్రదర్స్ వారి అనుచరులను అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. అనంతరం కోమటిరెడ్డి బ్రదర్స్ వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి అక్కడి నుండి వెళ్లిపోయారు. కాగా, తమను వేదికపైకి పిలవలేదని అందుకే వెళ్లిపోతున్నామనే ప్రధాన కారణాన్ని వీరు మీడియాకు తెలియజేశారు. ఇదిలా ఉండగా సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కూడా శిబిరం నుంచి అలిగి వెళ్లిపోయారు. అయితే ఈ అలకల వెనుక చాలా కారణాలున్నట్లు నేతలు తెలుపుతున్నారు. ఒకప్పుడు పార్టీకి కీలక నేతలైన వారిని ఈ శిబిరం వద్ద చిన్న చూపు చూడటమే ఇందుకు గల ముఖ్య కారణమంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.