అమరావతి, సెప్టెంబర్ 9: గత కొంతకాలంగా అత్యున్నత పదవులను అధిరోహించాలనుకుంటున్న నందమూరి హరికృష్ణకు నిరాశే ఎదురౌతున్న నేపధ్యంలో తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ పదవి విషయంలో పరాభవం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ పదవిని ప్రముఖ పారిశ్రామికవేత్త రవిశంకర్కు సీఎం చంద్రబాబు దాదాపు ఖరారు చేశారు. ఈ నిర్ణయంతో హరికృష్ణ తీవ్ర నిరాశ చెందిన తరుణంలో ఆయనను బుజ్జగించడానికి పార్టీ సీనియర్ నేతలను బాబు రంగంలోకి దించారట. ఆయనను రాజ్యసభ స్థానానికి నామినేట్ చేస్తామంటూ సీనియర్ నేతల ద్వారా తెలియజేసినట్లు సమాచారం. కుంటుంబ సభ్యులంతా విశేష పదవులను అలంకరించిన నేపధ్యంలో హరికృష్ణ కూడా ప్రతిష్టాత్మకమైన పదవిని చేపట్టాలనుకుంటున్నట్లు తెలుస్తుంది. అయితే అలాంటి స్థానాల్లో బంధువులను కూర్చోబెడితే అసలుకే మోసం వస్తుందన్న యోచనలో రాజకీయ ధురంధరుడు బాబు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.