హైదరాబాద్, సెప్టెంబర్ 7: హైదరాబాద్ లోని రామకృష్ణా థియేటర్లో అల్వాల్కు చెందిన జీఎస్ నరసింగరావు క్యాంటీన్, సైకిల్ స్టాండ్ను లీజు పద్ధతిలో నిర్వహిస్తున్నారు. ఇటీవల థియేటర్ను మల్టీప్లెక్స్ కోసం లీజుకు ఇవ్వాలని రామకృష్ణా థియేటర్స్ అధినేత నందమూరి జయకృష్ణ నిర్ణయించారు. దీంతో తన డిపాజిట్ సొమ్ము తిరిగివ్వాలని నరసింగరావు కోరడంతో రూ.19 లక్షల, రూ.8 లక్షల చొప్పున చెక్కులు ఇచ్చారు. ఈ చెక్కులు బౌన్స్ అవ్వడంతో, చెక్స్బౌన్స్ కేసులో జయకృష్ణకు ఎర్రమంజిల్ ప్రత్యేక కోర్టు 6 నెలల సాధారణ జైలు, రూ.25 లక్షల జరిమానా విధించింది. తీర్పును జిల్లా కోర్టులో అప్పీల్ చేసుకునేందుకు వీలుగా శిక్ష అమలును నెల రోజులపాటు వాయిదా వేస్తూ బెయిల్ మంజూరు చేసింది.