సియోల్, సెప్టెంబర్ 06 : ఎప్పుడేప్పుడు అమెరికాను నాశనం చేసేద్దామన్న ఉత్తరకొరియా... ఈసారి కనీవినీ ఎరుగని అసలు ఎవరు ఊహించని చర్యను ఐక్యరాజ్యసమితికి ఉత్తరకొరియా రాయబారి హన్ తే సంగ్ హెచ్చరించారు. తాజాగా ఉత్తరకొరియా దేశం అణు బాంబును విజయవంతంగా పరీక్షించడంతో, దేశాన్ని రక్షించేందుకు చేసిన ఆ పరీక్షను అమెరికాకు బహుమతిగా ఇస్తున్నామని, అమెరికా మా దేశంపై ఒత్తిడి తెస్తున్నంత కాలం ఇలాంటి బహుమతులు అందుకుంటూనే ఉంటుంది. ఇది అమెరికా చర్యలపైనే ఆధారపడి ఉంటుందని హన్ తే సంగ్ పేర్కొన్నారు. గత ఆదివారం ఉత్తరకొరియా అత్యంత శక్తిమంతమైన హైడ్రోజన్ బాంబును విజయవంతంగా పరీక్షించిన విషయం తెలిసిందే. ఈ బాంబు విస్ఫోటం వల్ల 5.7 తీవ్రతతో కృత్రిమ భూకంపం సంభవించింది. విస్ఫోటం నుంచి వెలువడిన శక్తి 50 నుంచి 60 కిలో టన్నుల వరకూ ఉంటుందని దక్షిణకొరియా వాతావరణ సంస్థ అంచనా వేస్తోంది. ఉత్తరకొరియా తాజా ప్రయోగంపై అమెరికా సహా ప్రపంచ దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఉత్తరకొరియాకు తగిన సమాధానం చెబుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. మరోవైపు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ వున్ యుద్ధం కోసం అడుక్కుంటున్నారని ఐక్యరాజ్యసమితి అమెరికా రాయబారి నిక్కీ హేలీ వ్యాఖ్యలు చేయడం జరిగింది.