న్యూఢిల్లీ, సెప్టెంబర్ 06 : ఢిల్లీలో మరో ఘోరం చోటుచేసుకుంది. నడుస్తున్న కారులో ఉజ్బెకిస్థాన్ కు చెందిన ఓ మహిళపై దుండగులు సామూహిక ఆత్యాచారానికి పాల్పడ్డారు. అసలు విషయంలోకి వెళితే సోమవారం రాత్రి 9.30 గంటల సమయంలో సదరు బాధితురాలు షాపింగ్ కోసం వసంతకుంజ్ ప్రాంతానికి వెళ్లింది. షాపింగ్ పూర్తయ్యాక ఆమె తిరిగి ఆటోలో ఇంటికి బయలుదేరింది. మార్గ మధ్యంలో ఆగిపోవడంతో ఆమెను దించేసిన ఆటో డ్రైవర్ వేరే వాహనంలో వెళ్లమని చెప్పాడు. దీంతో వేరే ఏదైనా వాహనం కోసం ఎదురు చూస్తుండగా ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఆమెను బలవంతంగా కారులోకి ఎక్కించుకుని, కారులోనే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఖిర్కీ ఎక్స్ టెన్షన్ ప్రాంతంలో ఆమెను వదిలివెళ్లారు. ఆ తర్వాత ఆమె జరిగిన దారుణం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు నిర్భయ చట్టం క్రింద కేసు నమోదు చేసి వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.