అమరావతి సెప్టెంబర్6: ఇటీవల జరిగిన నంద్యాల, కాకినాడ ఎన్నికల ఫలితాలు టీడీపీ అధినేత చంద్రబాబు లో మరింత ఉత్సాహాన్ని నింపాయా..? అనే అవుననే అంటున్నాయి తెదేపా వర్గాలు. ఈ ఎన్నికల్లో తెదేపా భారీ విజయాన్ని నమోదు చేసుకోవడంతో ఇదే స్పూర్తితో బాబు రాబోయే 2019 ఎన్నికలపై దృష్టి సారించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెదేపా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జులకు మంగళవారం విజయవాడలోని ఒక కన్వెన్షన్ సెంటర్లో రాష్ట్రస్థాయి కార్యశాల నిర్వహించారు. ఇందులో తెదేపా అధినేత మాట్లాడుతూ..ఇప్పటివరకు రియల్ గవర్నెన్స్ చేశా.. ఇకపై రియల్ పాలిటిక్స్ చేస్తానని అన్నారు. ప్రజల్లోకి వెళ్లినప్పుడు మనతోని సాధ్యమయ్యే హామీలు మాత్రమే ఇవ్వాలని, లేకపోతే హామీ తీర్చ లేని పక్షంలో ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని, నాయకులంతా బలాన్ని పెంచుకోవాలని, బలహీనతల్ని సరిదిద్దుకోవాలని పార్టీ శ్రేణులకు హిత బోధ చేశారు. సమావేశంలో పాల్గొన్న నాయకులందరికీ వ్యక్తిత్వ వికాస పరీక్ష నిర్వహించారు. ‘థామస్ పర్సనాలిటీ ప్రొఫైల్ అసెస్మెంట్’ విధానంలో ఈ పరీక్ష నిర్వహించారు. ఇందులో రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలతో పాటు, వ్యక్తిత్వ వికాస ప్రశ్నలను కూడా అడగడం జరిగింది.