న్యూఢిల్లీ , సెప్టెంబర్ 05 : బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ తో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమై, వివిధ అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఈ మేరకు బ్రిక్స్ సదస్సును విజయవంతంగా నిర్వహించినందుకు గాను జిన్ పింగ్ ను మోదీ అభినందించారు. భారత్-చైనాలు పరస్పరం అగ్ర పొరుగుదేశాలని, ప్రపంచ శక్తులుగా ఆవిర్భవిస్తున్న అతిపెద్ద దేశాలని జిన్ పింగ్ తెలిపారు. తమ రెండు దేశాల నడుమ ఆరోగ్యకరమైన సంబంధాలు అవసరమని ఆయన అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు. 73 రోజుల డోక్లాం ప్రతిష్ఠంభన నేపథ్యంలో 1954లో భారత్-చైనా కుదుర్చుకున్న పంచశీల ఒప్పందం అమలులో భారత్ తో కలిసి పనిచేసేందుకు, భారత్ మార్గదర్శకత్వాన్ని కోరేందుకు చైనా సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు.