హైదరాబాద్, జూన్ 4 : హజ్ యాత్రికులకు మార్గదర్శ వాలంటీర్లుగా సేవలందించేందుకు రాష్ట్ర హజ్ కమిటి దరఖాస్తులను ఆహ్వానించింది. ప్రతి 200 మంది హజ్ యాత్రికులకు ఒకరు చొప్పున వాలంటీర్లను ఎంపిక చేయనున్నారు. ఇందుకు సంబంధించి దరఖాస్తులు సమర్పించాలని రాష్ట్ర హజ్ కమిటి ప్రత్యేక అధికారి ఎస్.ఏ షుకూర్ నివేదించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ముస్లిం ఉద్యోగులు ఇందుకు అర్హులని వివరించారు. ఇప్పటి వరకు హజ్ లేదా ఉమ్రా ఆరాధనలు పూర్తి చేసి, జూలై, 2017 వరకు 25-58 సంవత్సరాల వయస్సు కలిగి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చునని వివరించారు. జూన్ 7 వరకు దరఖాస్తు సమర్పించాలని, ఫిబ్రవరి28, 2018 వరకు గడువు ఉన్న పాస్ పోర్టు తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. దరఖాస్తులలో నుండి డ్రా పద్దతి ద్వారా వాలంటీర్లను ఎంపిక చేయడం జరుగుతుందని వివరించారు. ఎంపికైన వాలంటీర్లకు మెుత్తం ఖర్చులు హజ్ కమిటీ భరిస్తుందని తెలిపారు. ఆసక్తి, అర్హత గల్గిన అభ్యర్థులు www.hajcommittee.gov.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.