ఆస్ట్రేలియా, సెప్టెంబర్ 05 : ఇటీవల ఆస్ట్రేలియాలో ఓ ఘటన చోటుచేసుకుంది. దక్షిణ ఆస్ట్రేలియా, ఉత్తర టెరిటరీ సరిహద్దులోని ఓ ప్రాంతంలో టెక్నీషియన్ గా పని చేసే థామస్ మాసోన్ (21) కొద్దిరోజుల క్రితం విధులు ముగించుకుని కారులో వెళ్తున్నాడు. ఇంతలో అతని కారుకి అడవి ఒంటెల గుంపు ఎదురు రావడంతో, ఒంటెలు ఏదైనా హాని తలపెడతాయోయన్న భయంతో కారు దారి మార్చారు. ఆ దారి ఆస్ట్రేలియాలో మనుషులెవ్వరూ వెళ్లని ప్రమాదకర ప్రాంతం దిశగా చాలా దూరం వెళ్లిన తరువాత ప్రమాదానికి గురైంది. మసోన్ ఈ ప్రమాదం బారి నుంచి సురక్షితంగా బయటపడ్డారు. కారును మాత్రం కాపాడుకోలేకపోయారు. ఆ ప్రాంతంలో ఫోన్ సిగ్నల్స్ కూడా లేకపోవడంతో కారులో ఉన్న టార్చ్ లైట్ పట్టుకుని ఆ అడవి గుండా దారీతెన్నూ తెలియని స్థితిలో కాలినడక ప్రారంభించాడు. సుమారు 60 గంటలు నడుస్తూనే ఉండడంతో, మధ్యలో ఆకలి వేస్తే మూత్రంతో కడుపునింపుకున్నారు. ఇలా 140 కిలోమీటర్లు నడిచిన తరువాత ఒక హైవేను చేరుకున్నాడు. అప్పటికే అతని తల్లిదండ్రులు అతని కోసం వెతకని చోటులేదు. మూడో రోజు ముగుస్తుండగా మాసోన్ రోడ్డు చేరడం, అతని ఫోన్ కు సిగ్నల్స్ రావడం, పోలీసులు అతనిని గుర్తించడం ఒకేసారి జరిగాయి. దీంతో పోలీసులు, అతనిని చేరుకుని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి, ఆయన తలిదండ్రులకు సమాచారం అందించారు.