థానే, సెప్టెంబర్ 4 : ఓ వివాహితను కామెంట్ చేసిన వ్యక్తికి థానేలోని ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఒక్క రూపాయి జరిమానాతో పాటు ఒక రోజు కోర్టు ముగిసే వరకు నిలబడి వుండాలని సాధారణ శిక్షను విధించింది. అసలు విషయంలోకి వెళితే, థానే సిటీలోని గోడ్ బందర్ రోడ్డు ప్రాంతంలో ఓ మహిళ తన భర్తతో కలసి ఉదయాన్నే వాకింగ్ కు వెళ్లి, ఇంటికి తిరిగి వస్తుండగా... పొరుగింటి ఓ వ్యక్తి చెత్త కుండీని కాళ్లతో పడేయడంతో పాటు, చమ్మక్ చల్లో అంటూ కామెంట్ చేశాడు. దీంతో, ఆమె ఆగ్రహంతో వెంటనే హౌసింగ్ సొసైటీకి ఫిర్యాదు చేసింది. కానీ వారు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో, ఆమె పోలీసులను ఆశ్రయించారు. దీంతో, పోలీసులు సదరు వ్యక్తిపై ఐపీసీ సెక్షన్ 509 కింద కేసు నమోదు చేసి, కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో కేసును విచారించిన జడ్జి ఇంగాలే అతనికి సాధారణ శిక్ష విధించారు.