విజయవాడ సెప్టెంబర్ 4: బెజవాడలో వైకాపా పార్టీలో నెలకొన్న రాజకీయ ముసలం బట్టబయలైంది. విజయవాడ నగర వైకాపా మాజీ అధ్యక్షుడు వంగవీటి రాధా... ఆ పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతంరెడ్డిల మధ్య రాజకీయ వేడి రాజుకుంది. గౌతం రెడ్డి ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యులో వంగవీటి రంగా పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వాఖ్యలు సోషల్ మీడియా లో ప్రచారం కావడంతో వంగవీటి వర్గీయులు గౌతం రెడ్డి పై తీవ్ర ఆగ్రహ ఆవేశాలను వ్యక్తం చేశారు. అయితే ఈ విషయాన్ని గమనించిన పార్టీ అధిష్టానం వెంటనే గౌతం రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే రౌడీ రాజకీయాలు చివరికి పోస్ట్ మార్టానికి వెళ్లాల్సిందే.. అని సంచలన వ్యాఖ్యలు చేయడంతో వంగా వర్గీయులు గౌతం రెడ్డి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. పరిస్థితిని గమనించిన పోలీసులు వంగవీటి రంగా, గౌతం రెడ్డి ల ఇంటి ముందు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అటు గౌతం రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేయడంతో ఆయన వర్గీయులు ప్రధాన వీధుల్లో ఆందోళన చేశారు. పార్టీ తన నిర్ణయాన్ని మార్చుకోకుంటే పార్టీనే వీడతామని హెచ్చరించారు. ముందస్తు జాగ్రత్తగా ర్యాపిడ్ యాక్షన్ బలగాలను రంగంలోకి దించారు. సత్యనారాయణపురంలో గౌతంరెడ్డి ఇంటి వద్ద కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ మార్గంలో రాకపోకలను నియంత్రించారు.