న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3 : కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా నిర్మల సీతారామన్ కు కీలకమైన రక్షణ శాఖ దక్కింది. ఇందిరాగాంధీ తర్వాత ఆ శాఖ మంత్రైన తొలి మహిళగా నిర్మల చరిత్ర సృష్టించారు. మరో ముఖ్య శాఖైన రైల్వేను పీయూష్ గోయల్ కు అప్పగించిన ప్రధాని ఇతర శాఖల్లోనూ కీలక మార్పులు చేశారు. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఎవరికీ ఏ శాఖ దక్కుతుందన్న అంశంపై ఉత్కంఠం మెదలైంది. వాణిజ్య శాఖ మంత్రిగా మంచి పని తీరు కనపరిచి కేబినెట్ మంత్రిగా పదవులను పొందిన నిర్మల సీతారామన్ కు కీలకమైన రక్షణశాఖ బాధ్యతలు అప్పగించారు. కేంద్ర మంత్రి పదవికి మనోహర్ పరికార్ రాజీనామా చేసి గోవా ముఖ్యమంత్రిగా వెళ్ళినప్పటి నుంచి రక్షణశాఖ బాధ్యతల్ని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పర్యవేక్షిస్తున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ భాగంగా రక్షణశాఖను మరొకరికి అప్పగిస్తారని అందరు భావించారు. ఇటీవల జైట్లీ సైతం అదే తరహ సంకేతాలిచ్చారు. అందుకు అనుగుణంగా నిర్మలకు రక్షణశాఖ కేటాయించారు. జైట్లీ ఆర్థిక వ్యవహారాల శాఖమంత్రిగా కొనసాగుతున్నారు. మరో కీలక శాఖలైన రైల్వేను పీయూష్ గోయల్ కు అప్పగించారు. వరుస రైలు ప్రమాదాల నేపథ్యంలో సురేష్ ప్రభు దగ్గరున్న రైల్వే శాఖను మరొకరికి అప్పగించవచ్చని ముందు నుంచి ఊహాగానాలు వినిపించాయి. అందరు భావించినట్లే ప్రధాని మోదీ ఈ మేరకు మార్పులు చేశారు. ఇప్పటివరకు విద్యుత్ శాఖ మంత్రిగా మంచి పనితీరు కనపరిచి కేబినెట్ లో స్థానం పొందిన పీయూష్ గోయల్ కు పదవులను అప్పగించారు. బొగ్గు శాఖ బాధ్యతలని ఇకముందు కూడా గోయల్ పర్యవేక్షించనున్నారు. సురేష్ ప్రభుకు వాణిజ్యం, పరిశ్రమల శాఖ అప్పగించనున్నారు. కేబినెట్ మంత్రిగా పదోన్నతిని పొందిన మరో మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు అదనంగా నైపుణ్యాభివృద్ధి శాఖను కేటాయించారు. ఇప్పటివరకు ఉమాభారతి పర్యవేక్షణలో ఉన్న జల వనరులు నదుల అభివృద్ధి గంగ ప్రక్ష్వాల శాఖ బాధ్యతలని ఉపరితల రవాణా శాఖ మంత్రిగా ఉన్న నితిన్ గడ్కరీకి అదనంగా అప్పగించారు. ఉమాభారతిని తాగునీరు పారిశుద్ధ్య శాఖకు బదీలి చేశారు. జౌళి శాఖ మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీకి అదనంగా సమాచార ప్రసారాల శాఖ బాధ్యతలు అప్పగించారు. దత్తాత్రేయ పర్యవేక్షించిన కార్మిక శాఖను సంతోష్ కుమార్ గాగన్ కు స్వాతంత్ర్య హోదాలో కేటాయించారు. కొత్తగా మంత్రివర్గంలో చేరిన హర్ దీప్ సింగ్ కు పట్టణాభివృద్ధిని, గృహా నిర్మాణ శాఖను సహాయమంత్రి హోదాలో అప్పగించారు. పర్యాటకం సహా ఎలెక్ట్రానిక్స్ ఐటీ శాఖ సహాయక మంత్రి బాధ్యతలని స్వాతంత్ర హోదాలో ఆల్ఫోన్స్ కన్నన్ తానం కు కేటాయించారు. విద్యుత్ పునరుత్పాదన ఇంధన వనరుల సహాయ మంత్రిగా బాధ్యతలని స్వాతంత్ర హోదాలో ఆర్ కె సింగ్ కు అప్పగించారు. ప్రస్తుతం రవాణా, సమాచార, ప్రసారాల సహా మంత్రిగా ఉన్న రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ కు అదనంగా క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ బాధ్యతలను స్వాతంత్ర హోదాలో కేటాయించడం జరిగింది. ఇప్పటివరకు ఆ శాఖ బాధ్యతలు చూసిన విజయ్ గోయల్ ను పార్లమెంటరీ వ్యవహారాల సహా గణాంకాలు, పథకాల అమలు శాఖ సహాయమంత్రిగా బదిలీ చేశారు. గ్రామీణ అభివృద్ధి పంచాయితీ రాజ్ శాఖలు పర్యవేక్షిస్తున్న నరేంద్ర సింగ్ తోమ్మార్ కు అదనంగా గన్నులశాఖ అప్పగించారు. కొత్తగా సహాయమంత్రిగా అప్పగించిన అశ్విని కుమార్ చౌబేకు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ అనంతకుమార్ హెగ్డేకు నైపుణ్యాభివృద్ధి శాఖ కేటాయించారు. సహాయమంత్రులుగా ప్రమాణం చేసిన శివ ప్రతాప్ శుక్లాకు ఆర్థికశాఖ, వీరెంద్రకుమార్ కు మహిళా, శిశు సంక్షేమ, మైనార్టీ సంక్షేమ శాఖ బాధ్యతలు అప్పగించారు.