న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: అమెరికాకు సంబంధించి కొత్త తరానికి చెందిన ఎఫ్-16 లను లేక స్వీడన్కు చెందిన గ్రైపెన్స్ జెట్లను కొనుగోలు చేయాలని భారత రక్షణ శాఖ భావిస్తోంది. భారత్ వద్ద ఉన్న మిగ్-21, మిగ్-27 జెట్లు 2021 లో వాయుసేన నుంచి తప్పుకోవటంతో ఈ యుద్ధ విమానాలను కొనుగోలు తప్పనిసరి అయింది. వాయుసేనకు సింగిల్ ఇంజిన్ జెట్ల అవసరం ఉంది. కాగా, ఎఫ్-16 లను తయారు చేసే లాక్ హీడ్ మార్టిన్ కంపెనీ ఇప్పటికే ఎఫ్-16 జెట్లను పాకిస్థాన్కు కూడా విక్రయించింది. దీంతో భారత వాయుసేన వాటిని కొనుగోలు చేయడానికి సుముఖత చూపిస్తుందో లేదో అన్న సందిగ్ధత ఉంది. భారత్ కొనుగోలు చేయాలనుకుంటున్న గ్రైపెన్స్ జెట్లను స్వీడన్కు చెందిన కంపెనీ తయారు చేస్తుంది. వీటిని కూడా అత్యాధునిక సాంకేతికతతో అభివృద్ధి చేశారు. ఈ నేపథ్యంలో రానున్న రెండు నెలల్లో భారత రక్షణ శాఖ నుంచి జెట్ల ఎంపికపై అధికారిక ప్రకటన జరుగనుంది. కాగా, 2023 లో 36 రఫెల్ యుద్ధ విమానాలు భారత్ కు చేరనున్నట్లు సమాచారం.