ప్రేమించిన అమ్మాయికి నిశ్చితార్థం .. తట్టుకోలేక ఆత్మహత్య

SMTV Desk 2019-12-02 15:41:08  

తాను ప్రేమించిన అమ్మాయికి జరుగుతున్న నిశ్చితార్థాన్ని చూసి తట్టుకోలేక, మనస్తాపం చెందిన ఓ యువకుడు, వ్యవసాయ బావిలో దూకి తనువు చాలించిన ఘటన కరీంనగర్ జిల్లా, శంకరపట్నం సమీపంలో జరిగింది. పోలీసులు, బాధిత కుటుంబం వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, మొగిలిపాలెం గ్రామానికి చెందిన జక్కుల సంతోష్, హుజూరాబాద్ లో చిన్న ఉద్యోగం చేసుకుంటూ, అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. వారిద్దరి కులాలు వేరు కావడంతో, గతంలో యువతి తల్లిదండ్రులు సంతోష్ పై కేసు కూడా పెట్టారు. అప్పట్లో సంతోష్ ఓ మారు ఆత్మహత్యాయత్నం చేసి, బతికిపోయాడు.

ఇది జరిగిన కొన్నాళ్ల తరువాత, తనకు రూ. 6 లక్షలు ఇవ్వకుంటే, మరోసారి కేసు పెడతానని యువతి తండ్రి బెదిరింపులకు దిగడంతో, ఆయనకు సంతోష్ రూ. 4 లక్షలు ఇచ్చాడు. యువతికి నిశ్చితార్థాన్ని ఏర్పాటు చేయగా, తన వద్ద తీసుకున్న రూ. 4 లక్షలను తన తల్లికి ఇప్పించాలని, తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని సర్పంచ్ కి వాయిస్ రికార్డు పంపి, వ్యవసాయ బావిలో దూకాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు.