అమరావతి, సెప్టెంబర్ 1: కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... తనపై నమ్మకంతో తెదేపాను గెలిపించిన కాకినాడ ఓటర్లకు కృతజ్ఞతలు అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రతిపక్ష వైసీపీ నేతలు ఎంతో కష్టపడి తెదేపా ప్రభుత్వ పాలనపై బురద జల్లిన కూడా ప్రజలు మోసపోలేదన్నారు. ఆఖరికి వైసీపీ కుల, ప్రాంత రాజకీయాలు చేయడానికి ప్రయత్నించిందని, అది బెడిసి కొట్టిందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తపరిచారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితి నుండి గట్టించగల ఏకైక పార్టీ తెదేపా నే అంటూ ఆయన తెలిపారు. ప్రతిపక్ష పార్టీ ఏపీ అభివృద్ధిని అడ్డుకుంటుందంటూ ఆయన విమర్శించారు. ప్రజలు తెదేపా ప్రభుత్వం పాలనలో సంతృప్తికరంగా ఉన్నారన్నారు. ప్రతిపక్షాలు పట్టిసీమకు ఎంత అడ్డుపడిన దాన్ని విజయవంతంగా పూర్తి చేసామని, రాయలసీమకు కూడా 150 టీఎంసీల వరకు నీటిని అందించామని చంద్రబాబు చెప్పారు. ఏపీలో సాంకేతికతను ఉపయోగించి అవినీతిని అంతమొందిస్తామని ఆయన స్పష్టం చేశారు.