మహాభారతంలో నేర్చుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు!

SMTV Desk 2019-11-26 11:57:26  

మహాభారతం 18 పర్వాలు, లక్ష శ్లోకాలతో ప్రపంచంలోని అతిపెద్ద పద్య కావ్యాలలో ఒకటిగా ఖ్యాతికెక్కింది. ‘యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్క్వచిత్.. అంటే ఇందులో ఏది ఉందో అది ఎక్కడైనా ఉంది... ఇందులో లేనిది మరెక్కడా లేదు’ అని ప్రశస్తి పొందింది. హిందువులకు ఎంతో పవిత్ర గ్రంథాలైన భగవద్గీత, విష్ణు సహస్రనామ స్తోత్రం కూడా మహాభారతంలోని భాగాలే. దీనిని బట్టి ఈ కావ్య విశిష్టత ఏంటో అర్థం చేసుకోవచ్చు. దాయాదుల మధ్య ఆధిపత్య పోరు చివరకు కురు వంశ వినాశనానికే దారితీసింది. ద్వాపర యుగం నాటి మహభారతంలో సంఘటనలు, సన్నివేశాలు నేటి కాలానికి అనేక పాఠాలుగా ఉపయోగపడుతోంది. భారతం నుంచి ముఖ్యంగా 12 విషయాలను గ్రహించాలి. జీవితం లో గెలవడానికి జాలి, దయ, మంచితనం మాత్రమే ఉంటే చాలదని, పరిస్థితులు, సమయాన్ని బట్టి నడుచుకోవాలనేది కర్ణుడు పాత్ర తెలియజేస్తుంది.మంచితనానికి, ధాన ధర్మాలకి కర్ణుడు మారుపేరుగా నిలిచినా సమయాన్ని బట్టి నడుచుకోకుండా అధర్మంవైపు నిలబడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు.చెడు స్నేహం ఊహలకి అందని జీవితం నాశనం చేస్తుందని శకుని ద్వారా వివరించాడు. కౌరవులతో స్నేహం నటిస్తూనే వారికి కలలో కూడా ఊహించని పరాజయాన్ని మిగిల్చాడు. కౌరవుల నాశనానికి పరోక్షంగా బీజాలు వేసింది కూడా శకునే. ఇలాంటి వారు నిజ జీవితంలో మనకు ఎదురవుతారు. అలాంటి వారి ఇచ్చే సలహాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.బేధాలు చూడని నిజమైన స్నేహం జీవితంలో ఉన్నత స్థానానికి తీసుకెళ్తుందనడానికి కృష్ణుడు, కర్ణుడు పాత్రలే ఉదాహరణ. కురుక్షేత్రంలో పాండవుల పక్షాన శ్రీకృష్ణుడు, కౌరవుల పక్షాన కర్ణుడు నిలిచి ఏ స్థాయిలో ఉపయోగపడ్డారో తెలిసిందే. కర్ణుడి లేని రారాజు బలం, కౌరవ సేనకు ధైర్యం ఊహించలేనిది. కుల, మత, పేద, ధనిక భేదాలను చూడకుండా మంచివారితో స్నేహం చేసేవారు ఖచ్చితంగా జీవితంలో విజయం సాధిస్తారు.అధికం అనేది అత్యంత ప్రమాదకరమని కౌరవ సంతానం ద్వారా వ్యాసుడు వివరించాడు. వంద మంది కుమారులు ఉండటం వల్ల వారిని పెంచడానికి గాంధారికి చాలా కష్టపడింది. రాజ్యాన్ని బిడ్డలకి సమానంగా పంచడం, వారి బాగోగులు చూస్తూ క్రమశిక్షణతో పెంచడం చాలా కష్టం. అలాగే దుర్యోధనుడి కోపం, అధికమైన రాజ్యకాంక్ష కారణంగా కౌరవులు నాశనం అయ్యారు. కాబట్టి అన్ని చోట్లా ముఖ్యంగా చెడు పక్షాన అధికం అనేది అత్యంత ప్రమాదకరమని తెలుస్తోంది.ఎవరి పనులు వారే చేసుకోవడం వల్ల అత్యంత క్లిష్ట సమయంలో ఉపయోగపడతాయని పాండవులే ఉదాహరణ. అరణ్య వాసం, అజ్ఞాతవాసం సమయంలో పాండవులకు గతంలో నేర్చుకున్న ఇంటి, వంట పనులు ఉపయోగపడ్డాయి. అలాగే మనిషికి కూడా అవసరాల కోసం కొన్ని పనులు నేర్చుకోవాలి.మనకి సంబంధింన దాని కోసం ఎంత కష్టమైన పోరాడాలని పాండవుల దృడవైఖరి తెలియజేస్తోంది. కౌరవులతో పోల్చుకుంటే పాండవుల సైన్యం చాలా తక్కువ. అయినా కానీ, పాండవులు ఆత్మవిశ్వాసం, చిత్తశుద్దితో పోరాటం చేసి విజేతలుగా నిలిచారు.పిల్లల పట్ల అతి ప్రేమ నష్టం కలిగిస్తుందనడానికి ధ్రుతరాష్ట్రుడే ఉదాహరణ. ఓవైపు బిడ్డల మీద ప్రేమ, ఇంకోవైపు తను నమ్ముకున్న సిద్దాంతాల మధ్య ధ్రుతరాష్ట్రుడు నలిగిపోయాడు. కొడుకుల వినాశనం తెలిసినా వారు చేస్తోన్న దురాగతాలను ఆపలేకపోయాడు. ఒకవేళ ద్రుతరాష్ట్రుడు తన బిడ్డల మీద అంత ప్రేమని పెంచుకోక, క్రమశిక్షణలో పెట్టి ఉంటే విషయం అంత వరకూ వెళ్ళేది కాదేమో. ఎవరి మీద అయినా అతి ప్రేమ, అతి నమ్మకం నాశనానికి, మోసానికి దారితీస్తాయి.విద్యను జీవితాంతం నేర్చుకోవడమే ఉత్తమ బహుమతినడానికి అర్జునుడే ఉదాహరణ. జీవితం ఆసాంతం విద్యలు నేర్చుకుంటూనే ఉన్నాడు. ద్రోణాచార్యు నుంచి అస్త్ర విద్యలు, ఇంద్రుడు నుంచి దైవ సంబంధ ఆయుధాల ప్రయోగం, మహదేవుడి నుంచి పాశుపతాస్త్రం, యుధిష్టరుడు, కృష్ణుడి నుంచి రాజనీతులను ప్రతి దశలోనూ అభ్యసించడమే అర్జునుడికి ఓ ప్రత్యేక స్థానం దక్కింది. నిత్యం నేర్చుకోవడం వలన ఖచ్చితంగా విజయం వరిస్తుంది.కొన్నిసార్లు శత్రువులు కూడా మిత్రుల రూపంలో ఎదురవుతారనేది ఈ పాత్రలే నిదర్శనం. విదుర, ద్రోణ, భీష్ములు కౌరవుల పక్షాన ఉన్నా వారిలో అనేక మంది పాండవులకు సాయపడ్డారు. రహస్యంగా పాండవులకి ఎంత సహాయం చేశారో. ఇక విదురుడు కౌరవుల ప్రతీ అడుగు పాండవులకి మోసుకొచ్చినవాడే.మహిళలను ఆపదల నుంచి కాపాడాలని, అలా కాకపోతే అనర్థాలకు దారితీస్తుందనేది ద్రౌపది వస్త్రాపహరణమే ఉదాహరణ. అత్యంత బలవంతులు, శూరులు అయి ఉండి కూడా నిండు సభలో ద్రౌపదికి జరిగిన అవమానాన్ని అడ్డుకోలేకపోయారు.మిడిమిడి జ్ఞానం పనికిరాదని అంటారు. ఇది అత్యంత ప్రమాదకరం. పద్మవ్యూహంలోనికి వెళ్లడమే కానీ కానీ బయటపడటం తెలియక తనకున్న అర్ధ జ్ఞానంతో అభిమన్య్యుడు లాంటి మహావీరుడే నేలకొరిగాడు. ఏ పనిని అయిన పూర్తిగా తెలుసుకున్న తర్వాతే మొదలుపెట్టాలి. అలా కాకపోతే ఆ పనిని మధ్యలోనే వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది.స్త్రీని అవమానించరాదనే సత్యం భారతంలోని ప్రధాన అంశం. కేవలం తనకు జరిగిన అవమానం వల్ల ద్రౌపది కౌరవులపై పెంచుకున్న కోపం చివరికి వారిని, సామ్రాజ్యాన్ని నామ రూపాలు లేకుండా చేసింది. స్త్రీలు దేవతలతో సమానం వాళ్లను అవమానించడం చాలా ఘోర తప్పిదం.