కేంద్రం కీలక నిర్ణయం :ఒకే దేశం.. ఒకే రోజు వేతనం..!!

SMTV Desk 2019-11-16 14:09:22  

శ్రామికుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడివుందని కార్మిక శాఖ మంత్రి సంతోష్ గాంగ్వర్ అన్నారు. ఢిల్లీలో సెంట్రల్ అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ సెక్యూరిటీ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. వన్ నేషన్-వన్ పే డే తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. దేశ వ్యాప్తంగా వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారికి ప్రతి నెలా సకాలంలో ఓకే రోజు వేతనాలు అందించేందుకు సిద్ధమవుతున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఇందుకోసం ఉద్దేశించిన చట్టాన్ని ప్రధాని మోడీ త్వరలోనే తీసుకురాబోతున్నారు. అలాగే, కార్మికులకు మెరుగైన జీవితం గడిపేందుకు అన్ని రంగాల్లో ఒకే విధంగా కనీస వేతనాలు ఉండేలా చర్యలు తీసుకుంటామని కార్మిక శాఖ మంత్రి సంతోష్ గాంగ్వర్ చెప్పారు.

మోడీ సర్కారు 2014 నుంచే కార్మిక సంస్కరణలను ప్రారంభించిందన్న మంమత్రి.. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులందరికీ 3వేల పింఛనుతో పాటు వైద్య బీమా అందించాలని నిర్ణమయించామని చెప్పారు. రానున్న రోజుల్లో అసంఘటిత రంగ కార్మికులు, కూలీలకు సామాజిక భద్రత కల్పించేందుకు మరిన్ని పథకాలు తీసుకురానున్నమని గాంగ్వర్ చెప్పారు. అధిక సంఖ్యలో ఉపాధి కల్పిస్తున్న వాటిల్లో ప్రైవేట్ సెక్యూరిటీ పరిశ్రమ అతిపెద్దదన్నారు. ఇందులో 90 లక్షలు మంది పనిచేస్తున్నారని, త్వరలో ఈ సంఖ్య 2 కోట్లకు చేరే అవకాశముందని పేర్కొన్నారు మంత్రి.