హైదరాబాద్ సెప్టెంబర్ 1: 2019 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజకీయాలు చేసి చేసి అలిసిపోయారని వారు త్వరలోనే రిటైర్ అవుతారని తెరాస నాయకులు సెటైర్ వేస్తుంటే.. మేము రిటైర్ అవ్వడం కాదు రిక్రూట్ మెంట్ చేస్తాం అని తెలంగాణ కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ కాలం చెల్లిందని ఇకపై అధికారాన్ని చేపట్టే అవకాశం ఆ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో లేదని కేసీఆర్ విమర్శిస్తూ ఉంటే, టీఆర్ఎస్ పార్టీలో ఉన్న అసంతృప్తి నాయకులంతా కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తున్నారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘాటుగా స్పందించారు. నేటి కొత్త తరం రాజకీయాల్లో ఏ పార్టీ హవా కొనసాగితే ఆ పార్టీలోకి నాయకులంతా జంప్ అవడం మళ్ళీ ఆ పార్టీలో ముసలం మొదలైతే ఇతర పార్టీ లోకి జంప్ అవడం చాలా సహజం. ఇదే ఫార్ములా తోనే కాబోలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గులాబీ పార్టీలో గుబులు పెట్టించే విధంగా ప్రతి స్పందించారు.