సీబీఐ కోర్టులో జగన్ కు షాక్

SMTV Desk 2019-11-01 15:26:14  

ఆస్తుల కేసులో వ్యక్తిగతంగా సీబీఐ కోర్టుకు హాజరు కాకుండా మినహాయింపు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను హైదరాబాద్ సీబీఐ కోర్టు డిస్మిస్ చేసింది. సీబీఐ జగన్ పిటిషన్‌పై గట్టిగా వాదనలు వినిపించింది. ఈ కేసులో పరిస్థితులు మారాయి.. నేరంలో ఎలాంటి మార్పు లేదని తెలిపింది. జగన్ ఎంపీగా ఉన్నప్పుడే సాక్షులను ప్రభావితం చేయాలని ప్రయత్నించారని.. జగన్ ఇప్పుడు సీఎం స్థానంలో ఉన్నారని.. మినహాయింపు ఇస్తే సాక్షుల్ని ప్రభావితం చేస్తారని చెప్పింది. సీబీఐ వాదనతో ఏకీభవించిన సీబీఐ కోర్టు.. పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. జగన్ ఆస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని సీబీఐ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సీబీఐ, జగన్ తరపు లాయర్లు తమ వాదనలు వినిపించగా.. కోర్టు తీర్పును నవంబర్ 1కి రిజర్వ్ చేసింది. జగన్ తరపు లాయర్లు తమ వాదనలు వినిపిస్తూ.. జగన్ ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నారని.. ప్రతి శుక్రవారం హైదరాబాద్ కోర్టుకు రావాలంటే ప్రభుత్వ ధనం దుర్వినియోగం కావడంతో పాటూ విధి నిర్వహణలో చాలా ఇబ్బందులు కలుగుతాయని లాయర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అందుకే తాము వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నామని చెప్పారు. గతంలో సుప్రీం, హైకోర్టులు ఇచ్చిన తీర్పులను కోర్టుకు గుర్తు చేశారు. కౌంటర్‌ దాఖలు చేసినప్పుడు సీబీఐ వాడిన భాష తీవ్ర అభ్యంతరంకరంగా ఉందన్నారు లాయర్లు. తాము రాష్ట్ర ప్రయోజనాల కోసమే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతున్నామని.. జగన్ హాజరుకాకపోతే కేసు విచారణలో జాప్యం ఎలా జరుగుతుందో సీబీఐ చెప్పాలని వాదనలు వినిపించారు. గతంలో ఎప్పుడూ కేసుల వాయిదా కోరలేదని.. స్టే కూడా అడగలేదని గుర్తు చేశారు. అలాగే సాక్ష్యులలను ప్రభావితం చేసినట్లు ఆరేళ్లలో ఒక్క ఆరోపణ కూడా లేదని కోర్టుకు విన్నవించారు. ఇటు సీబీఐ లాయర్లు కూడా తమ వాదనలు వినిపించారు. జగన్ గతంలో కూడా వ్యక్తి గత హాజరు మినహాయింపు కోరుతూ పిటిషన్ వేశారని.. ఆ పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేసిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మళ్లీ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను తోసిపుచ్చాలని కోర్టును కోరారు. జగన్ సాక్ష్యుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని మళ్లీ తమ వాదనను వినిపించారు. అంతేకాదు ఆర్థిక నేరానికి సంబంధించిన కేసుల్లో కఠినంగా వ్యవహరించాలని సుప్రీం కోర్టు గతంలో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఒకవేళ జగన్‌కు వ్యక్తిగత మినహాయింపు ఇస్తే.. అధికారంలో ఉన్నారు కాబట్టి సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు. ఈ వాదనలతో సీబీఐ కోర్టు ఏకీభవించింది.