టీమిండియా మాజీ ఆటగాడు రాహుల్ ద్రవిడ్కు పరస్పర విరుద్ధ ప్రయోజనాల సెగ నుంచి ఇంకా విముక్తి కలగలేదు. బీసీసీఐ ఎథిక్స్ అధికారి డీకే జైన్ నవంబర్ 12న ఆయన్ను వ్యక్తిగతంగా హాజరయ్యి తనపై నమోదు చేసిన విరుద్ధ అభియోగాలపై మరింత స్పష్టత, వివరణలు ఇవ్వాలని సూచించారు. సెప్టెంబర్ 26న మొదటి సారి ద్రవిడ్ ఎథిక్స్ అధికారి వద్ద విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం జీవితకాల సభ్యుడు సంజీవ్ గుప్తా మిస్టర్ డిఫెండబుల్పై ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ అధినేతగా రాహుల్ ద్రవిడ్ పనిచేస్తున్నారు. అంతకు ముందు ఆయన భారత్-ఏ, అండర్-19 జట్లకు కోచ్. అంతేకాకుండా ఇండియా సిమెంట్స్లో ఓ విభాగానికి వైస్ ప్రెసిడెంట్. ఈ సంస్థకు ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ఉంది. ఇది విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తుందని సంజీవ్ ఫిర్యాదు చేశారు. మొదటి సారి ఎథిక్స్ అధికారిని కలిసినప్పుడు తాను ఇండియా సిమెంట్స్ నుంచి వేతనం చెల్లించని సెలవు తీసుకున్నానని ద్రవిడ్ వివరణ ఇచ్చారు. క్రికెట్ పాలకుల కమిటీ సైతం ఆయనకు మద్దతుగా లేఖ రాసింది. పరస్పర విరుద్ధ ప్రయోజనాల నిబంధనను బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ద్రవిడ్కు ఎథిక్స్ అధికారి నోటీసులు పంపించినప్పుడు ఇక భారత క్రికెట్ను దేవుడే రక్షించాలి అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం భారత క్రికెట్ ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన అంశం ఇదేనని వ్యాఖ్యానించారు. ఈ నిబంధనలో సవరణ చేయాలని సీఓఏ ఒక స్టేటస్ రిపోర్ట్ను సుప్రీం కోర్టుకు సమర్పించింది. దానిని కోర్టు ఆమోదిస్తే బీసీసీఐ, రాష్ట్ర క్రికెట్ సంఘాల్లో రెండేళ్ల కాల పరిమితితో ఒప్పందాలు చేసుకున్న మాజీ క్రికెటర్లకు ఊరట లభిస్తుంది. వారు వేర్వేరు పాత్రలను పోషించొచ్చు.