మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అరెస్టు

SMTV Desk 2019-10-30 15:25:13  

అనంతపురం జిల్లా వెంకటాపురంలో స్థల వివాదం కాస్త రాజకీయ రంగు పులుముకుంది. స్థలం చుట్టూ వైఎస్సార్సీపీ నేత వెంకట్రామిరెడ్డి బండలు పాతించడం సంచలనం కలిగించింది. అధికార పార్టీ నేతలు ఉద్దేశపూర్వకంగానే టీడీపీ నేత నాగరాజు ఇంటికి వెళ్లే రోడ్డును మూసివేశారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. రాకపోకలు సాగించేందుకు వీల్లేకుండా నాగరాజు ఇంటి చుట్టూ బండలు పాతించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వెంకటాపురంలో కొద్ది రోజులుగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెంకటాపురంలో జరిగిన సంఘటనలో నిజాలు నిర్ధారించేందుకు టీడీపీ నేతలు వెంకటాపురం వెళ్లేందుకు ప్రయత్నించారు. మూడు రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పోలీసులు అడ్డుకుంటూ వచ్చారు. టీడీపీ సీనియర్ నేత, అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వెంకటాపురం వెళ్లేందుకు అనంతపురం నుంచి బయలుదేరగా బుక్కరాయసముద్రం పోలీసులు జేసీ కారును అడ్డుకున్నారు. జేసీని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కారును అడ్డుకోవడంతో జేసీ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తమ పార్టీ నేత ఇంటికి అడ్డంగా పెట్టిన బండలు తొలగించేందుకే జేసీ దివాకర్ రెడ్డి వెంకటాపురం బయలుదేరినట్లు సమాచారం. ఆయనతోపాటు పలువురు టీడీపీ నేతలు కూడా వెంకటాపురం బయలుదేరారు. అయితే బండలు నాటిన స్థల వివాదం కోర్టులో ఉందని పోలీసులు జేసీకి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ జేసీ వెంకటాపురం వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి బుక్కరాయసముద్రం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆయనతో పాటు టీడీపీ నేతలు బీటీ నాయుడు, యామిని బాల తదితరులను అరెస్టు చేశారు. జేసీ అరెస్టుతో వెంకటాపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొన్నిరోజులుగా వైఎస్సార్సీపీ, టీడీపీ మధ్య ఇంటి స్థలం విషయమై వివాదం నెలకొంది. వైఎస్సార్సీపీ కార్యకర్త వెంకట్రామిరెడ్డి స్థలం చుట్టూ బండలు పాతడంతో వివాదం తలెత్తింది. స్థలంలో రహదారి ఉందని, టీడీపీ నేత ఇంటికి వెళ్లే రోడ్డును మూసివేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతకు మద్దతుగా జేసీ దివాకర్‌ రెడ్డి వెంకటాపురం గ్రామానికి వెళ్లే యత్నం చేశారు. అయితే వెంకట్రామిరెడ్డి తన స్థలంలోనే బండలు పాతుకున్నట్లు పోలీస్‌, రెవెన్యూ అధికారులు నిర్థారించడం విశేషం.