వల్లభనేని పయనం ఎటు...? రాజీనామా వెనుక వైసీపీ హస్తం!

SMTV Desk 2019-10-28 15:22:16  

ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా రాజకీయాల్లో పెద్ద చర్చగా మారింది. టిడిపికి రాజీనామా చేసి వైసీపీలోకి వెళ్తారు అని అందరూ భావించారు. కాని ఆయన మాత్రం అనూహ్యంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని నిర్ణయించుకున్నారు. అయితే ఇప్పుడు వైసీపీలోకి వెళ్తారా..? లేని పక్షంలో ఆ పార్టీకి బయట నుంచి మద్దతు ఇస్తారా అన్నది ఆసక్తిగా మారింది. వంశీ వ్యూహాత్మకంగా టీడీపీ సభ్యత్వంతో పాటూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.. ఆ లేఖను చంద్రబాబు పంపించారు. పరోక్షంగా రాజీనామా వ్యవహారాన్ని టీడీపీ అధినేతకు అప్పగించారు. మరి ఈ రాజీనామాపై చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అంతేకాదు టీడీపీ అధినేతను ఇరుకును పెట్టేలా.. వైఎస్సార్‌సీపీకి కూడా మరో ఆయుధంలా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదో కొత్త రాజకీయ వ్యూహమనే చర్చ మొదలయ్యింది.వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక ఎవరైనా ఎమ్మెల్యేలు పార్టీ మారాలంటే పదవికి రాజీనామా చేయాలని జగన్ క్లియర్‌గా చెప్పారు. ఆ వెంటనే రాజీనామాను కూడా స్పీకర్ ఆమోదించాలని తేల్చి చెప్పారు. వంశీ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆ లేఖను చంద్రబాబుకు పంపడం ఆసక్తిగా మారింది. బాబు వంశీ లేఖను స్పీకర్‌కు పంపిస్తే.. ఆయన ఆమోదం తెలిపితే గన్నవరంలో ఆరు నెలలలోపు ఉప ఎన్నిక జరగాలి. అదే జరిగితే బైపోల్‌కు టీడీపీనే కారణమని వైఎస్సార్‌సీపీ టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి.రాజీనామా లేఖను స్పీకర్‌కు పంపించకపోతే.. వంశీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినా.. చంద్రబాబు తన దగ్గరే ఉంచుకున్నారని వైఎస్సార్‌సీపీ ప్రచారం చేస్తే టీడీపీకి కొత్త తలనొప్పులు ఖాయం. ఇలా ఎటు చూసినా టీడీపీ అధినేతను ఇరుకున పెట్టేలా వంశీ రాజీనామా లేఖ రూపంలో ఆయుధం దొరికినట్లయ్యింది. స్పీకర్‌కు రాజీనామా చేరందే వైఎస్సార్‌సీపీలో చేరడానికి ఉండదు.. వంశీ తటస్థ ఎమ్మెల్యేగా అవకాశం ఉంది. మరి ఈ పొలిటికల్ గేమ్ ఎలా మలుపు తిరుగుతుందో చూడాలి.