విశాఖలో నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య

SMTV Desk 2019-10-28 15:15:08  

విశాఖలో ఓ నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా కలకలం రేపింది. విశాఖపట్నంలోని కేజీహెచ్‌‌లో నర్సింగ్ మూడో ఏడాది చదువుతున్న బేబీ శివలక్షి అనే యువతి హాస్టల్‌ గదిలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషయాన్ని గమనించి తోటి విద్యార్థినులు వెంటనే హాస్టల్ నిర్వాహకులకు సమాచారం అందించగా వారు పోలీసులకు ఫోన్ చేశారు. దీంతో పోలీసులు హాస్టల్‌కు చేరుకుని శివలక్ష్మి మృతదేహాన్ని కిందికి దించి కేజీహెచ్‌కు తరలించారు. నాన్ టీచింగ్ స్టాఫ్ వేధింపుల వల్లే శివలక్ష్మి ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు వస్తుండటంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. అనకాపల్లికి చెందిన శివలక్ష్మి నర్సింగ్ మూడో సంవత్సరం జరుగుతోంది. మరో మూడు నెలల్లో కోర్సు పూర్తికానుందని, ఈలోగా తమ కూతురు ఇంతటి దారుణానికి పాల్పడుతుందని ఊహించలేదని తల్లిదండ్రులు విలపిస్తున్నారు. ఆదివారం ఉదయం కూడా తమతో ఫోన్లో బాగానే మాట్లాడిందని, ఒక్కరోజులోనే విషాద వార్త వినాల్సి వస్తుందని ఊహించలేదని వాపోతున్నారు. శివలక్ష్మి ఆత్మహత్యపై విశాఖ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.