కూనంనేని సాంబశివరావు దీక్షభగ్నం...అరెస్ట్ చేసి ఆసుపత్రికి తరలింపు

SMTV Desk 2019-10-28 15:13:51  

ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఉన్న సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు ఈ నెల 26నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఆదివారం సాయంత్రం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను చికిత్స కోసం నిమ్స్2కు తరలించారు. పోలీసులు తనను అరెస్ట్ చేయడంపై తీవ్రంగా మండిపడిన కూనంనేని... చికిత్సకు కూడా ఆయన నిరాకరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై ప్రభుత్వం దుర్మార్గపు చర్యలకు పాల్పడుతోందని, అక్రమ అరెస్టులకు తెరతీస్తోందని ధ్వజమెత్తారు. ప్రత్యేక ఉద్యమ సమయంలో కేసీఆర్‌ ఖమ్మంలో అరెస్టు అయినప్పుడు సీపీఐ శాసన సభ్యుడిగా ఉండి ధైర్యం చెప్పానని గుర్తుచేశారు.ఉద్యమ పోరాటాల ద్వారా వచ్చిన కేసీఆర్‌ ఉద్యమాలను అణచివేయడం సరికాదని కూనంనేని సాంబశివరావు హితవు పలికారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యే వరకూ తన దీక్ష కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. కూనంనేని అరెస్టుతో నిమ్స్‌ ఆసుపత్రి ఎమర్జెన్సీ భవనం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. శనివారం మగ్దూం భవన్‌లో కూనంనేని చేపట్టిన ఆమరణ దీక్షను సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి ప్రారంభించారు. ఆర్టీసీ.. ఆదాయాన్ని సమకూర్చే సంస్థ కాదని, దానిని ప్రజా రవాణా సంస్థగానే పరిగణించాలని ఆయన సూచించారు.కార్మికులు ముందస్తు నోటీసు ఇచ్చి.. అనివార్యంగా సమ్మె చేపడితే విచ్ఛిన్నం చేసేందుకు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఉద్యోగులు, కార్మికుల త్యాగాలతో సాకారమైన తెలంగాణకు సీఎం అయిన కేసీఆర్‌.. వారిని అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ఆర్టీసీ నష్టాలకు కార్మికులు కారకులు కాదని, ప్రభుత్వ విధానాలే కారణమని ఆయన విమర్శించారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ఏపీలో సాధ్యమైనప్పుడు తెలంగాణలో ఎందుకు కాదని సురవరం ప్రశ్నించారు.