ముంబై, సెప్టెంబర్ 1: భారత క్రికెట్ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీకి గురువారం కొలంబో వేదికగా జరిగిన నాలుగో వన్డే సంచలనాత్మకమైనది. ఈ మ్యాచ్ ధోనీ కెరీర్లో 300వ వన్డే కావడం విశేషం. తన చారిత్రాత్మక వన్డేకు గుర్తుగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ధోనీకి ప్లాటినం బ్యాట్ను బహూకరించింది. అయితే ఈ బహుమతిని కెఫ్టెన్ కోహ్లీ రికార్డుల వీరుడు ధోనీకి బహుకరించారు. అనంతరం టీమిండియా ప్రస్తుత సారథి కోహ్లీ మాట్లాడుతూ... ఇప్పుడు జట్టులో ఉన్న 90 శాతం మంది ఆటగాళ్లు మీ సారథ్యంలోనే ఆడామని గుర్తు చేశాడు. 'మీరెప్పుడూ మా కెప్టెనే' అంటూ ధోనీని కొనియాడాడు. మూడు వందల వన్డేలో ధోనీ గొప్ప ఆట తీరుని కనబరిచాడు. 42 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 49పరుగులు సాధించాడు. కాగా, నిన్న జరిగిన నాలుగో వన్డేలో 168 పరుగుల భారీ వ్యత్యాసంతో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.