దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌....భారత్ 3-0తో క్లీన్‌స్వీప్..!

SMTV Desk 2019-10-22 12:15:32  

దక్షిణాఫ్రికాతో రాంచీ వేదికగా మంగళవారం ముగిసిన మూడో టెస్టు మ్యాచ్‌లో భారత్ 202 పరుగుల తేడాతో విజయం సాధించి 3-0తో సిరీస్‌ని సొంతం చేసుకుంది. స్వదేశంలో 2012 నుంచి టెస్టుల్లో జైత్రయాత్ర సాగిస్తున్న భారత్ జట్టుకి ఇది వరుసగా 11వ టెస్టు సిరీస్ విజయం కావడం విశేషం. ఈ సిరీస్ లో తోలి టెస్ట్ విశాఖపట్నంలో జరుగగా 203 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా.. పుణె టెస్టులో ఇన్నింగ్స్, 137 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.రాంచీ టెస్టు ఆటలో నాలుగో రోజైన మంగళవారం ఓవర్‌నైట్ స్కోరు 132/8తో రెండో ఇన్నింగ్స్‌ని కొనసాగించిన దక్షిణాఫ్రికా 133 పరుగులకే కుప్పకూలిపోయింది. ఈరోజు తొలి సెషన్ రెండో ఓవర్‌లోనే వరుస బంతుల్లో డిబ్రయిన్ (30: 49 బంతుల్లో 4x4, 1x6), లుంగి ఎంగిడి (0) వికెట్లను స్పిన్నర్ నదీమ్ పడగొట్టేశాడు. దీంతో.. సఫారీల రెండో ఇన్నింగ్స్‌తో పాటు భారత్ గడ్డపై వారి పర్యటన కూడా ముగిసింది. శనివారం ఆరంభమైన రాంచీ టెస్టులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు.. ఓపెనర్ రోహిత్ శర్మ (212: 255 బంతుల్లో 28x4, 6x6) డబుల్ సెంచరీ, అజింక్య రహానె (115: 192 బంతుల్లో 17x4, 1x6) శతకం బాదడంతో తొలి ఇన్నింగ్స్‌ని 497/9 వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా బౌలర్లు జార్జ్ లిండే నాలుగు వికెట్లు పడగొట్టగా.. కగిసో రబాడ మూడు తీశాడు. ఆదివారం రెండో సెషన్ ఆఖర్లో భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌ని డిక్లేర్ చేయగా.. అనంతరం మొదటి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన దక్షిణాఫ్రికా పేలవ రీతిలో 162 పరుగులకే సోమవారం రెండో సెషన్‌కి ఆలౌటైంది. దీంతో.. 335 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందుకున్న టీమిండియా.. వెంటనే సఫారీలను ఫాలోఆన్ ఆడించింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లోనూ దక్షిణాఫ్రికా టాప్ ఆర్డర్ చేతులెత్తేయడంతో ఆ జట్టు 133 పరుగులకే ఆలౌటైంది. మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ జట్టు ఏకంగా 116.3 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయగా.. సఫారీలు రెండు ఇన్నింగ్స్‌లోనూ కలిపి 56.2 +48 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేయడం కొసమెరుపు.