ప్రకాశం, ఆగస్ట్ 31: రోజురోజుకీ యువత గాడితప్పుతుంది. భారత్ సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందుతున్నప్పటికీ, సంస్కృతికంగా మాత్రం అట్టడుగుకు పడిపోతూనే ఉంది. నిత్యం దేశంలో ఎక్కడో ఒక చోట అమ్మాయిలపై వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రైలు ప్రయాణంలో యువకుల వేధింపులు తాళలేక నడుస్తున్న రైలు నుండి ఒక యువతి దూకేసింది. సంఘటన స్థలంలో ఉన్న బాధితురాలి స్నేహితులు తెలిపిన వివరాల ప్రకారం... విజయవాడకు చెందిన షేక్ నజ్మూల్ అనే యువతికి నేడు పెళ్లి చూపులు ఉన్నాయని, దీంతో చెన్నైలో పనిచేస్తోన్న ఆమె... రైలులో తన స్నేహితురాళ్లతో కలిసి సొంత ఊరికి ప్రయాణిస్తోందని తెలిపారు. అయితే రైలులో ఉన్న కొందరు యువకులు వేధించడంతో ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ వద్ద ఆమె రైలులో నుంచి దూకేసిందని వెల్లడించారు. తీవ్రగాయాల పాలయిన ఆమెను రైల్వే సిబ్బంది ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఈ వికృత చర్యలు పాల్పడిన యువకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.