ఓక్స్ వ్యాగన్ కుంభకోణం.. సీబీఐ కోర్టుకు హాజరైన మంత్రి బొత్స

SMTV Desk 2019-09-24 14:59:23  

జెర్మన్ కార్ల కంపెనీ ఓక్స్ వ్యాగన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో పరిశ్రమ నెలకొల్పేందుకు ముందుకొచ్చింది. అందులో భాగంగా ఓక్స్ వ్యాగన్ కంపెనీకి మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న వశిష్ట వాహన్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ. 11 కోట్లు ఇచ్చింది. ఓక్స్ వ్యాగన్ వశిష్ట వాహన్ సంస్థతో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పడంతో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ తగవు అప్పట్లో రాజకీయంగా పెద్ద దుమారం రేపింది. ప్రభుత్వ పెద్దల అవినీతి బాగోతం వలనే కార్ల కంపెనీ రాష్ట్రానికి రాలేదంటూ విపక్షాలు ఆరోపించాయి. అప్పటి భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణపై కూడా అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఈ కేసును CBI కి అప్పగించింది. 2005లో CBI ఓక్స్ వ్యాగన్ కుంభకోణంపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించి, మొత్తం ఏడుగురిపై కేసు నమోదు చేసి, నలుగురిపై అభియోగాలు మోపింది. జైన్, అళగ రాజా, గాయత్రి, వశిష్ట వాహన్ సీఈవో సూష్టర్‌లపై అభియోగాలు నమోదు చేసింది. CBI కోర్టులో మూడు వేల పేజీల చార్జ్‌షీట్ దాఖలు చేసింది. సుమారు 59 మంది సాక్షులను విచారించి, ఇప్పటి వరకు రూ.7 కోట్లు రికవరీ చేసిన CBI మిగిలిన సొమ్ము రికవరీ కోసం విచారణ చేపట్టింది. ఈ కుంభకోణంలో మంత్రి బొత్స ప్రమేయం లేదని CBI గతంలోనే నివేదిక ఇచ్చింది. వశిష్ట వాహన్‌కు చెల్లింపుల వ్యవహారంలో అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి అయిన బొత్సను CBI సాక్షిగా చేర్చింది.ఓక్స్ వ్యాగన్ కేసు విచారణకు హాజరుకావాలని బొత్సకు ఇప్పటికే నాంపల్లి CBI కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఆయన CBI కోర్టుకు హాజరయ్యారు.