విజయవాడ, ఆగస్ట్ 31: దేశంలో అన్ని ప్రధాన నగరాల్లో ఇప్పటికే అమలులో ఉన్న ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ తప్పనిసరిగా వాడాలనే నిబంధన రేపటి నుండి విజయవాడలో అమలు చేస్తున్నట్లు డీసీపీ కాంతిరాణా ప్రకటించారు. ఈ నేపధ్యంలో ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ను కచ్చితంగా ధరించాల్సిందేనని ఆయన తెలిపారు. దీనితో పాటు నిబంధనలు అతిక్రమించిన వారికి ఉండే జరిమానాలు కూడా ఆయన వెల్లడించారు. మొదటిసారి హెల్మెట్ ధరించకుండా పట్టుబడితే రూ. 100 జరిమానా విధించి వదిలేస్తామని, తరచు ఇలా దొరికితే జరిమానా కూడా పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దవుతుందని హెచ్చరించారు. ఇటీవలి కాలంలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలలో ద్విచక్రవాహనదారులే ప్రమాదాలకు గురవుతున్నారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.