ముంబై, ఆగస్ట్ 31: ఇటీవల ముంబైలో పునర్నిర్మాణ దశలో ఉన్న బహుళ అంతస్తుల భవనం కూలిన సంగతి తెలిసిందే. తాజాగా భేండీ బజార్లో నేటి ఉదయం మరో బహుళ అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. అయితే స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆ భవనంలో మొత్తం 9 కుటుంబాలు నివాసముంటున్నాయి. ఈ దుర్ఘటన తెలిసిన వెంటనే హూటాహుటిన రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ దుర్ఘటనలో మొదట ఒకరు మృతి చెందినట్లు వెల్లడించిన అధికారులు, కొద్ది సమయానికే నాలుగురు మరణించినట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఈ మరణాల సంఖ్య 10 చేరినట్లుగా అధికారులు తెలిపారు. కాగా, శిధిలాలలో మొత్తం ఎంత మంది ఉన్నారు అనే విషయంపై ఇంకా స్పష్టత రావల్సివుందని అధికారులు పేర్కొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భవనం పూర్తిగా నానిపోవడం, సుమారు 100సంవత్సరాల క్రితం నిర్మించిన భవనం కావడం కూలిపోవడానికి గల ప్రధాన కారణాలుగా అధికారులు భావిస్తున్నారు. కాగా, రంగంలోకి దిగిన నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్, 10 అగ్నిమాపక దళాలు శిథిలాలను తొలగించే పనిలో ఉన్నాయి.