పాక్ తీరు ఇక మారదు!!

SMTV Desk 2019-08-21 13:18:10  

కశ్మీర్ అంశంపై ఐరాసలో రహస్య భేటీని ఏర్పాటు చేసిన పాకిస్తాన్ కు అండగా ఉన్న చైనాకు షాక్ తగిలిన సంగతి తెలిసిందే. అత్యవసరంగా నిర్వహించిన ఐరాస భేటీలో భద్రతామండలిలోని సభ్యదేశాలేవీ పాకిస్థాన్‌కు అండగా నిలవలేదు. కశ్మీర్ వ్యవహారాన్ని మీరు మీరూ తేల్చుకోండని ముఖం మీదే చెప్పేశాయి. అయితే ఐక్యరాజ్య సమితి సాక్షిగా ఘోర భంగపాటుకు గురైనప్పటికీ పాకిస్థాన్ బుద్ధి మాత్రం మారలేదు. కశ్మీర్ అంశంపై అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని పాక్ మంగళవారం ప్రకటించింది. కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, ఈ అంశాన్ని ఐసీజే దృష్టికి తీసుకెళ్తామని పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషి తెలిపారు. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాటల దూకుడు తగ్గించుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించిన తర్వాత కూడా పాక్ తీరు మారకపోవడం గమనార్హం. కశ్మీర్ సమస్య పూర్తిగా అంతర్గతమైందని పేర్కొంటున్న భారత్.. ఈ విషయంలో పాకిస్థాన్ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. పాకిస్థాన్‌తో చర్చలంటూ జరిపితే అది కేవలం పాక్ ఆక్రమిత కశ్మీర్ కోసమేనని తెగేసి చెప్పింది. సరిహద్దుల్లో పాకిస్థాన్ యుద్ధ విమానాలను మోహరిస్తుండటం పట్ల కూడా భారత్ సీరియస్‌గా స్పందించింది. ఇప్పటి వరకూ అణ్వాయుధాలను ముందుగా వాడొద్దనే విధానానికి కట్టుబడి ఉన్నామని... ఇక మీదట ఏం జరగనుందనేది పర్యావసనాలపై ఆధారపడి ఉంటుందని పొరుగు దేశానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరికలు జారీ చేశారు.