కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త తెలిపిన ఎస్‌బీఐ

SMTV Desk 2019-08-21 13:17:35  

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త అందించింది. పండుగ సీజన్‌ డిమాండ్‌ను అందిపుచ్చుకోవడానికి బ్యాంక్ వివిధ రకాల ఆఫర్లను ప్రకటించింది. స్టేట్ బ్యాంక్ కేవలం చౌక వడ్డీకే రుణాలు కాకుండా ప్రాసెసింగ్ ఫీజు మాఫీ, ప్రిఅప్రూవ్డ్ డిజిటల్ లోన్స్ వంటి ప్రయోజనాలు కూడా అందిస్తోంది. బ్యాంక్ ఈ ఫెస్టివ్ ఆఫర్లకు నిర్ణీత గడువు అంటూ ఏమీ పేర్కొనలేదు. అయితే ఎస్‌బీఐ బాటలోనే ఇతర బ్యాంకులు కూడా నడిచే అవకాశముంది. పండుగ సీజన్‌లో కారు లోన్ తీసుకున్న వారికి ప్రాసెసింగ్ ఫీజు మాఫీ చేస్తామని బ్యాంక్ తెలిపింది. అలాగే ఈ రుణాలపై తక్కువ కనిష్ట వడ్డీ రేటు (8.7 శాతం నుంచి ప్రారంభం) అందిస్తున్నామని పేర్కొంది. అలాగే వడ్డీ రేట్లలో పెరుగుదల ఉండదని తెలిపింది. కస్టమర్లు కారు లోన్ కోసం బ్యాంక్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ యోనో లేదా వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ అప్లై చేసుకుంటే వడ్డీ రేటుపై 25 బేసిస్ పాయింట్ల రాయితీ పొందొచ్చని పేర్కొంది. అలాగే వేతన జీవులు (ఉద్యోగులు) కారు ఆన్‌ రోడ్ ధరలో 90 శాతం వరకు రుణ సదుపాయం పొందొచ్చని తెలిపింది. బ్యాంక్ ఇటీవలనే ఎంసీఎల్ఆర్ రేటును 15 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. దీంతో 2019 ఏప్రిల్ నుంచి హోమ్ లోన్స్‌పై వడ్డీ రేట్లు 35 బేసిస్ పాయింట్ల మేర తగ్గాయి. ప్రస్తుతం బ్యాంక్ రెపో లింక్డ్ హోమ్ లోన్స్ వడ్డీ రేటు 8.05 శాతం నుంచి ప్రారంభమౌతోంది. సెప్టెంబర్ 1 నుంచి ప్రస్తుత, కొత్త కస్టమర్లకు ఈ రేటు వర్తిస్తుంది. పర్సనల్ లోన్ విషయానికి వస్తే.. రూ.20 లక్షల వరకు రుణాన్ని 10.75 శాతం ప్రారంభ వడ్డీతో పొందొచ్చని బ్యాంక్ తెలిపింది. అలాగే తీసుకున్న రుణాన్ని 6 ఏళ్లలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అలాగే వేతన జీవులు యోనో ద్వారా రూ.5 లక్షల వరకు ప్రిఅప్రూవ్డ్ రుణాన్ని పొందొచ్చని తెలిపింది. రూ.50 లక్షల వరకు ఎడ్యుకేషన్ రుణాలపై వడ్డీ రేటు 8.25 శాతం నుంచి ప్రారంభమౌతోంది.