హైదరాబాద్, ఆగస్ట్ 30 : ఒకవైపు విద్యార్థులను, సాఫ్ట్ వేర్ వ్యవస్థను, మరోవైపు టాలీవుడ్ ను కుదిపేసిన విషయం ఏదైనా ఉందా అంటే అది కేవలం డ్రగ్స్ వ్యవహారం అని చెప్పొచ్చు. అంతలా చెలరేగిపోయిన ఈ వ్యవహారంలో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చర్యలను చేపడుతూ, తీవ్ర హెచ్చరికలు చేస్తున్నా వాటి వాడకం మాత్రం తగ్గడం లేదు. ఎక్కడో ఒకచోట ఈ వివాదం వెలుగు చూస్తూనే ఉంది. తాజాగా వరంగల్ "నిట్(నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)" కళాశాలలో డ్రగ్స్ వాడుతున్నారంటూ వార్తలు రావడంతో వసతి గృహంలో ఎక్సైజ్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఇద్దరు యువకులను (బిజ్జు, రమేష్) పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుండి ఎల్ఎస్డీ అనే మత్తుపదార్థాన్ని స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్ కు తరలించామని ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు.