పోలవరం ప్రాజెక్ట్ టెండర్ని రద్దు చేసి రీ టెండరింగ్ నిర్ణయం ప్రాజెక్టుని అనిశ్చితిలోకి నెట్టివేస్తుందని పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఆలోచన విరమించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. పీపీఏ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఆర్.కె.జైన్ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్దాస్కి లేఖ రాశారు. ప్రాజెక్టు విస్తృత ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని ప్రిక్లోజర్, రీ టెండరింగ్ ఆలోచనల్ని విరమించుకోవాలని సలహా ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టు టెండర్లు రద్దు చేసి, మళ్లీ టెండర్లు పిలవాల్సిన అవసరంగానీ, అలా చేయాలన్న ఆలోచనకు బలమైన ప్రాతిపదికగానీ లేదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. రీ-టెండరింగ్ తో ప్రాజెక్టు జాప్యమవడంతో పాటు, ఖర్చూ పెరిగే అవకాశం ఉందని లేఖలో పేర్కొన్నారు. ప్రాజెక్టు సకాలంలో పూర్తవకపోతే ప్రయోజనాలు అందడమూ ఆలస్యమవుతుందని రాశారు.